Tuesday, 28 October 2014

అవసరం తీరిపోని రచయిత

 - తోకల రాజేశం 28/10/2014
నేడు కొ.కు. జయంతి
నిజమైన సాహిత్యం మన సమాజంలో వుండే క్రూరత్వాన్నీ, పైశాచికత్వాన్నీ బయటపెట్టాలి. అప్పుడే అది ప్రజలకు సంబంధించిన సాహిత్యమవుతుంది’’ అని ఒక సందర్భంలో ప్రకటించిన కొడవటిగంటి కుటుంబరావు- తన జీవితాంతం అచ్చంగా అలాంటి సాహిత్యానే్న సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం ప్రజల సాంస్కృతిక జీవితం మీద చెరిగిపోని ప్రభావాన్ని వేసిన అతికొద్దిమంది తెలుగు మేధావుల్లో కుటుంబరావు ఒకరు. కుటుంబరావు ప్రధానంగా సాహిత్య జీవే అయినప్పటికీ ప్రజల సాంఘిక జీవితంతో సంబంధమున్న ప్రతీ అంశం మీద- అది చిన్నదైనప్పటికీ- తనదైన దృష్టిని సారించారు. తనకు గల దృక్పధంతో ప్రతీ అంశంమీద వెలుగును ప్రసరించాడు. తాను జీవితాన్ని- సాహిత్యాన్ని సక్రమమైన రీతిలో అవగాహన చేసుకోవడానికి తనకు ప్రాపంచిక దృక్పధముండటమే కారణమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
సాహిత్యమీద, అది సామాజిక వికాసంలో భాగంగా నిర్వహించవలసిన పాత్ర మీదా స్పష్టమైన అభిప్రాయాలు కలిగినవాడు కుటుంబరావు. ఆయన తన ఈ అభిప్రాయాలను సాహిత్య విమర్శద్వారా ప్రత్యక్షంగా- కథలూ, నవలలూ, గల్పికల ద్వారా పరోక్షంగా బయటపెట్టారు. సాహిత్యానికొక ప్రయోజనముంటుందని బలంగా నమ్మి- ఆ ప్రయోజనాన్ని సాధించటానికి తన కాలంలోని మరెవ్వరూ చేయనంత సాహిత్య కృషి ఆయనొక్కడే చేశారు. అందుకే ఆయన రచనలు రాశిలోనే గాక వాసిలోనూ గొప్పవని విమర్శకులంటారు. కొ.కు. తన నవలల్లో, కథల్లో చిత్రించిన పాత్రలు తమ కాలంకంటే ఎంతో ముందుచూపుతో ప్రవర్తిస్తాయి. విమర్శనాత్మకంగా ఆలోచిస్తాయి. వ్యక్తి వికాసాన్ని అడ్డుకోవడానికి కులమూ, మతమూ కల్పించిన అడ్డుగోడల్ని కూల్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాయి. అంటే ఈ పాత్రల్లోని ముందు చూపంతా కుటుంబరావుది. గురజాడ తరువాత ఇంత ముందుచూపు కలిగిన తెలుగు రచయితల్లో ఒక్క కుటుంబరావు తప్ప మరొకరు లేరు.
అయితే కుటుంబరావును పాఠకులు గుండెల్లో పెట్టుకోవడానికి ఆయన ముందుచూపు ఒక్కటే కారణం కాదు. శైలి కూడా ప్రధాన కారణమే. ‘‘తాము చేసే పనిలో భేషజం అనేది అణుమాత్రం కూడా లేని వాళ్లకు డళచిష్యశఒషజ్యఖఒశళఒఒ అనేది అంటదు. దాన్ని జయించటం అన్న సమస్యే వాళ్లకు కలగదు. కుటుంబరావుగారి తత్వం సరిగా అలాంటిదే నన్నాడో సందర్భంలో రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆ తత్వంనుంచి పుట్టిందే ఆయన శైలి. అందుకే ఏ ఆడంబరాలు లేకుండా- నిండు జీవితాన్ని అనుభవించిన వొక పెద్దమనిషి మాట్లాడుతున్నట్లుంటుందాయన శైలి. అందుకే ఆయన సీరియస్ పాఠకుల దగ్గరినుంచి సామాన్య పాఠకుల దాకా అందరినీ మెప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా మామూలు పత్రికలకు కూడా రాసేవారు. తన భావజాలాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో దేనె్నలా వాడుకోవాలో కుటుంబరావుకు బాగా తెలుసు.
‘‘జీవితాన్ని పురస్కరించుకొని పుట్టిన సాహిత్యం జీవితంలో విహితంగా వుండదు. జీవితం మీద తిరగబడుతుంది. జీవితాన్ని కోసి పరీక్ష చేస్తుంది. జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తుంది’’ అంటారు కుటుంబరావు. కుటుంబరావు సాహిత్యం చేసిన పని కూడా అదే. ఈనాటి సామాజిక పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కొడవటిగంటి వారి అవసరం ఆనాటి కంటే ఈనాడే ఎక్కువుందని అనిపిస్తుంది. ఆ అవసరాన్ని ఆయన సృష్టించి పెట్టిన సాహిత్యం తప్పకుండా తీరుస్తుంది.

వచన కవిత్వంవైపు నడిపించిన పుస్తకం..

చిన్నప్పటి నుంచే పద్యం దారిలో నడస్తున్న నన్ను అకస్మాత్తుగా వచన కవిత్వం వైపు లాగి పుస్తకం దుఃఖనది. నిర్మల్‌కు చెందిన ప్రసిద్ధ కవి మునిమడుగుల రాజారావు గారి రెండవ కవితా సంకలనం దుఃఖనది. అది సెప్టెంబర్25, 2005. అటు రాజారావుతోనూ, ఇటు వచన కవిత్వంతోనూ నాకంతగా పరిచయం లేదు. ఆ పుస్తకావిష్కర ణ తరువాత చిన్న పిల్లవానికి బూరు మిఠాయి దొరికినంత సంబురంగా పుస్తకం మొత్తం చదివిన.

నాకు వచన కవిత్వం పరిచయం కావడానికైనా, వచన కవిత్వ ప్రపంచంలోకి నన్ను స్వాగతించిన పెద్ద దర్వాజ దుఃఖనది. అప్పటి దాకా అనేక నిబంధనలతో కూడిన పద్య కవిత్వం రాయటం, చదవటంలో మునిగిపోయిన నేను.., దుఃఖనది చదువుతున్నంత సేపూ ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలిగింది. భవిష్యత్తులో వచన కవిత్వమే నాకు ప్రధాన వాహిక కాబోతున్న సంగతి బహుశా ఆ ఆనందంలో ఆనాడు నేను గుర్తించలేదు.

బాధ కవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. మనసులో బాధ లేకుండా కవిత్వం పుట్టిన దాఖలాలు అరుదు. సంఘర్షణ అయినా, దుఃఖం అయినా బాధకు ఇతర రూపాలు. బాధకు ఉన్నత రూపమైన (అత్యున్నత రూపం శోకం) దుఃఖాన్ని వస్తువుగా గ్రహించిన రాజారావు నిజంగానే ఉన్నతమైన కవిత్వాన్ని సృష్టించాడు.నది కదా జీవితం అంటాడు విలవిలలాడే నది కవితలో రాజారావు. జీవితంలో సుఖదుఃఖాలుంటాయి. సుఖం లో కన్నా దుఃఖంలోనే మనిషి మనిషితనం బయటపడుతుంది.

మనిషి దుఃఖపడుతున్నప్పుడే లోపట ఏ కల్మశమూ లేకుండా స్వచ్ఛంగా ఉంటాడు. అందుకేనేమో రాజారావు దుఃఖాన్ని పట్టించుకున్నాడు. తన కవిత్వాన్ని దుఃఖనది చేసుకున్నాడు. నాకు దుఃఖనది చదువుతున్నంత సేపూ నిజంగానే దుఃఖం కలిగింది. కవి ఏదయితే అనుభూతి చెంది రాశాడో, అదే అనుభూతి పాఠకుడు కూడా పొందగలిగితే అదే ఉత్తమ కవిత్వం. దుఃఖనది అలాంటి కవిత్వం.
రాజారావుకు ఎందుకంత దుఃఖం అని ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే.. మనిషిని కాబట్టి అనే ఆయన సమాధానమిస్తాడనుకుంటాను. కాళోజీ గారి విషయంలో ఆయన గొడవ ఎలాంటిదో రాజారావు గారి దుఃఖం అలాంటిదే. కేవలం దుఃఖం మాత్రమే పరిష్కారాలను సూచిస్తుందా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

కానీ కవిత్వమంతా చదివితే కానీ అసలు విషయం అర్థం కాదు. ముందుమాటలో గుడిపాటి అన్నట్లు దుఃఖాన్నీ, మృత్యువునీ గురించి నిష్క్రియాపరమైన వేదాంతం రాజారావు కవిత్వంలో కనిపించదు. ఇవ్వాళ మనిషిని వెంటాడుతున్న మృత్యువుకీ, దుఃఖానికీ మూలాలు వ్యవస్థ క్రూర స్వభావం లో ఉన్నాయన్న ఎరుక ఈ కవిత్వంలో వుంది.

ఆ ఎరుకే ఈ కవిత్వానికి ప్రాసంగికతను కల్పిస్తున్నది. మరణించటమంటే ప్రాణం పోవటం కాదు, యుద్ధం ఆగిపోవడంగా అర్థం చేసుకున్న రాజారావును అర్థం చేసుకోవటం అంత ఇబ్బందేం కాదు. గాఢమైన తాత్వికతను వొలుచుకుంటూ వెళితే ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకోవటం కూడా ఇబ్బందేం కాదు. దుఃఖంలో కూడా వికసించిన మానవ చైతన్యానికి ప్రతిరూపమే దుఃఖనది. అంతటి ప్రతిభావంతమైన పుస్తకం కాబట్టే.. దుఃఖనది నా కవితా పథాన్ని పూర్తిగా మార్చేసిన పుస్తకంగా భావిస్తున్నాను.
- తోకల రాజేశం, 9676761415

( నమస్తే తెలంగాణ దినపత్రిక చెలిమె లో ప్రచురితమైన నా జ్ఞాపకం )